Showing posts with label COMEDIANS. Show all posts
Showing posts with label COMEDIANS. Show all posts
Tuesday, 20 March 2012
Saturday, 22 October 2011
Thursday, 20 October 2011
Wednesday, 19 October 2011
హాస్యనటుడు 'రాజబాబు' నవ్వించి ఏడ్పించిన రాజబాబు
'నేను కోట్ల రూపాయలు సంపాదించాను' అని సగర్వంగా ప్రకటించుకున్న ఏకైక హాస్యనటుడు కూడా బహుశా రాజబాబు ఒక్కరేనేమో! హాస్య నటులు చరిత్ర రాస్తే అందులో మొదటి పేజీల్లోనే ఉండే పేరు ఆయనదని చెప్పవచ్చు. అయితే హాస్యనటుడిగా రాజబాబు ప్రస్థానం అంత తేలికగా మొదలవలేదు. పావలాతో మద్రాసుకు చేరుకున్న ఈ పుణ్యమూర్తుల అప్పలరాజు చాలాకాలం అన్నం లేక, సరైన బట్ట లేక కార్పొరేషన్ నీళ్లతో కడుపు నింపుకుంటూ ఎవరైనా పుణ్యమూర్తులు ఏరోజనై కడుపునిండా అన్నం పెడితే దాంతో రెండు మూడు రోజులు బతికేవారు. 'అలా అప్పుడప్పుడు అన్నం పెట్టిన మహానుభావుడు ఆనాటి హీరోయిన్ రాజసులోచన ఇంటి తోటమాలి. అవకాశాలు దొరక్క ట్యూషన్లు కూడా చెప్పేవాణ్ణి. నేను ట్యూషన్ చెప్పే ఇంట్లో ఏదో మూల కుక్కపిల్లలా పడుకుని ఉంటే ఎవరో లేపి కాఫీయో, రెండు ఇడ్లీలో ఇచ్చేవారు' అని ఆ రోజుల్లో రాజబాబు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ విన్నా 'అయ్యో పాపం' అనిపించకమానదు. చివరికి ఆయన నిరీక్షణ ఫలించి 'సమాజం' చిత్రంతో పరిశ్రమకు పరిచయమయ్యారు.
అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు తన నటజీవితాన్ని కామెడీతో ప్రారంభించినా విలనీతో పాటు విభిన్న పాత్రలను పోషించి మెప్పించారు. హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. డా.దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత-మనవడు' చిత్రంలో ఆయనే హీరో. ముందు ఆ వేషం వేయడానికి వెనుకంజ వేసినా దాసరి ప్రోత్సాహంతో ఆ పాత్ర పోషించారు రాజబాబు. ఆ సినిమాకి ఆయనకి ఎంతో పేరు తెచ్చింది. ఆ తరువాత దాసరి దర్శకత్వంలో రూపొందిన 'తిరుపతి'లో కూడా ఆయనే హీరో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాజబాబు నిర్మించిన తొలి సినిమా 'ఎవరికి వారే యమునా తీరే'కు దర్శకుడు దాసరి కావడం. 'బావా.. బావ' అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా మెలిగేవారిద్దరు. దాసరి రూపొందించిన చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు రాజబాబు.
పుట్టిన రోజున మంచి కార్యక్రమాలు
తన బతుకు పుస్తకంలో పేజీలు తరిగిపోతుండటంతో , ఆఖరి పేజీ దగ్గర పడిపోతోందేమోనన్న భయం ఆవరించి ఆ లోపు కొన్ని మంచి పనులు చేయాలన్న తపనతో రాజబాబు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శక్తి మేరకు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసేవారు. ముఖ్యంగా తన పుట్టిన రోజు ఏ ప్రయోజనం లేకుండా జరగడం అసంతృప్తికరంగా అనిపించి ఆ రోజున సీనియర్స్ని సన్మానించేవారు రాజబాబు. నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి కొత్త నటీనటులు పరిశ్రమకి పరిచయం కావడానికి దోహదపడ్డారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో 'పాతాళభైరవి' చిత్రంలో బాలకృష్ణ (అంజిగాడు) నటన రాజబాబుని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సినిమాని ఓ తొంభై సార్లు చూశారాయన. చూసిన ప్రతిసారీ హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది. అందుకే తను హాస్యనటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఙతలు వెల్లడించారు రాజబాబు.
నిర్మాతగా..
భవిష్యత్లో ఎప్పుడైనా కథ రాసుకుని స్వీయ దర్శకత్వంలో సినిమా తీయాలనే కోరిక రాజబాబుకి ఉండేది. ఆ ప్రయత్నంలో భాగంగా బాబ్ ఆండ్ బాబ్ క్రియేషన్స్ బేనరుపై 'మనిషి రోడ్డున పడ్డాడు' చిత్రాన్ని నిర్మించారు రాజబాబు. దీనికి కథకుడు ఆయనే. ఈ సినిమాలో ట్రాజెడీ వేషం వేశారు. ఎప్పుడు తమని నవ్వించే రాజబాబు తెరపై ఏడుస్తూ కనిపించే సరికి ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టారు. తనని చూసిన జనం మనసారా నవ్వుకోవాలి కానీ అలా ఏడవకూడదనుకున్న రాజబాబు ఇకపై ట్రాజెడీ వేషాలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే ఆయన తీయాలనుకున్న 'సరస్వతి లక్ష్మి బ్రహ్మ', 'సంఘం చేసి బొమ్మలు' చిత్రాలు తీయలేకపోయారు.
మాటల్లో వేదాంతం, వైరాగ్యం
ప్రేక్షకులకు నవ్వులు పంచే రాజబాబు జీవితం వెనుక బలమైన విషాదం ఏదైనా దాగి ఉందా అనిపించేది ఒక్కోసారి. ఆయన తాగినా మత్తులో ఉన్నా, లేకపోయినా వేదాంత వైరాగ్యాల గురించి సుదీర్ఘంగా మాట్లాడేవారు. అలాగే ఇంటర్య్వూల సారాంశం వేదాంతపరంగానే ఉండేది. తెరపై అంతగా నవ్వించే రాజబాబు ఎంతో భావగర్భితంగా, వేదాంత ధోరణిలో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచేది.
కెరీర్ని దెబ్బతీసిన అలవాటు
అలవాట్లు ఎప్పుడు ఎలా ప్రారంభమవుతాయో చెప్పలేం కానీ అంత బిజీగా ఉన్న రాజబాబు కెరీర్ కుదేలవడానికి ప్రధాన కారణం మద్యపానమే కారణమని చెబుతారు.విపరీతంగా తాగి షూటింగ్లకు గైరు హాజరయ్యేవారని అంటారు. రాజబాబుని పెట్టుకుంటే సినిమాకి హెల్ప్ అవుతుందనుకునే రోజులు పోయి ఆయనతో సినిమా చేయడం రిస్క్ అని భావించే పరిస్థితి ఏర్పడటానికి కారణం ఇదేనంటారు. అయితే తను తాగి షూటింగ్కి వచ్చేవాణ్ణనే అంటే రాజబాబు ఒప్పుకునేవారు కాదు. ' నేను తాగుతాను. పని లేని రోజున మాత్రమే తాగుతాను. మేకప్ వేసుకున్న తరువాత తాగను. కానీ పరిశ్రమ నన్ను దూరం చేసింది. విషప్రచారం చేసి పక్కన పెట్టింది. నిర్జీవమైన వస్తువులతో ఆడుకోండి. కానీ మనుషుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు' అనేవారాయన ఆ రోజుల్లో. 'నేను ఏ నిర్మాతకి, దర్శకుడికి అన్యాయం చేయలేదు. అప్పలరాజుని రాజబాబుగా మార్చి మంచి పొజిషన్లో నిలబెట్టి చివరికి ముంచెయ్యడం పరిశ్రమకి భావ్యమా ' అని ఆయన ఆవేదనతో ప్రశ్నించినా దానికి చివరి రోజుల్లో స్పందన కరువైంది.
ఆయనకే దక్కిన గౌరవం
తన పుట్టిన ఊరికి, కన్నవారికి ఎంతో ప్రతిష్టలు తెచ్చిన రాజబాబు శిలావిగ్రహాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెల్లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 70 మంది హాస్యనటీనటుల కలయికలో 'హాస్యకుంభమేళ' పేరుతో ఓ నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించింది తెలుగు చిత్రపరిశ్రమ. ఇదే రాజబాబుకి మాత్రమే దక్కిన గౌరవం. (నేడు రాజబాబు జయంతి)


Subscribe to:
Posts (Atom)

























