Thursday 27 October 2011

సిరివెన్నెల సీతారామశాస్త్రి

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది. ఆయన పదాల ఎంపిక, వాటి అమరిక లోనే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది.

ఆయన వాడే ప్రతి అక్షరం అప్పుడే పుట్టిన పాపాయిలా ఎంతో ముద్దుగా ఉంటుంది

అక్షరం ఆయన కోసమే పుట్టిందా అన్న భావన మనకి కలుగుతుంది.

వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది

అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది
అలా శాస్త్రి గారిని ఒడిసిపట్టిన ఆల్చిప్ప విశ్వనాధ్ గారు.
కళకి జీవం తోడైంది అదే జీవకళై సిరివెన్నెలగా మిగిపోయింది.

ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి. తెలుగు సినీ గీతరచయిత.


విధాత తలఁపున ప్రభవించినది... అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్‌వ్యూ లో చెప్పాడు. ధన మాయ ను ఎంత చిన్న చిన్న పదాలలొ పొదగగలరో దైవ మాయ ని కూడ అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఎర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగు లో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఫ్రస్తుత కాలమాన పరిస్ఠితులలో ప్రముఖం గా సినిమా పాటలతో ప్రజలను అలరిస్తున్న 'సిరివెన్నెల పాటల వల్ల మాత్రమే తెలుగు పాటల్లో లో తెలుగు ఇంకా బ్రతికి ఉంది అంటే అతిశయోక్తి కాదు అంటే ఒప్పుకోని జనాభా తక్కువేమో.


"అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.


కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారు.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారు.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేసింది .సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు. దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ. అలా వచ్చిందే లేడీస్ టైలర్. ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.


ఆయన కెరీర్‌ తొలిపాటలో రాసినట్లు 'విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితి ఈ గీతం' అంటూ రాజీలేని ధోరణిలో అద్భుతంగా కొనసాగుతోంది. 'గంగావతరణం' అనే గేయనాటిక విన్న విశ్వనాథ్‌ 'సిరివెన్నెల' చిత్రంకి పరిచయం చేస్తే ఆ గేయ నాటిక విన్న బాలు సీతారామశాస్త్రి సినిమాపాటని పాడకుండానే ''మీవి వందల పాటలు పాడాలని వుంది'' అని సీతారామశాస్త్రితో అనడం ఆ మాట ఫలించడం అంటే వందలాది పాటలు బాలు గళం నుంచి వెలువడడం జరిగింది.


సినిమా రచయితగా మారాడానికి ముందే సినారె రచనలను బాగా అభిమానించి ఆరాధనా భావం ఏర్పరుచుకున్న సీతారామశాస్త్రి సినారెని 'వృత్తి రాతగాడు కాదు వుత్తి రాతగాడూ కాదు' అని ప్రశంసించారు. అలాగే వేటూరిని కూడా అభిమానించడమే కాదు గురువుగా భావిస్తారాయన అందుకే 'విశ్వనాథ్‌ వేటూరి నాకు ప్రాత:స్మరణీయులు' అంటుంటారు.


''సినిమాని చీప్‌ ఆర్ట్‌ గా చాలమంది భావిస్తారు. అలాగే సినిమా కవుల్నీ. సినిమాకవి మామూలు కవి కంటె గొప్పవాడు. పాత్రలోకి ప్రవేశించి పాత్రతో అనిపించగలడు. అయినా సినిమాకి కావ్య గౌరవం సినీ పాటకి సాహిత్య గౌరవం రావడం లేదు'' అనే ఆవేదన సీతారామశాస్త్రి వెలిబుచ్చుతుంటారు అప్పుడప్పుడు.


''పాట, పాటలో మాట ఆర్కెస్ట్రాలో భాగమైపోయింది ఇటీవల. అందుకే పాటతో బాటు ఆ పాటలోని మాట వినబడితే ఏమౌతుందో, ఏ కొంప ములుగుతుందో అనే బాధవుంది. సమాజం ఎక్కడ నుంచోరాదు. నానుండి, నా ఇంటినుంచి మొదలవుతుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మంచి సమాజం మంచి రచనలు, మంచి సినిమాలు వస్తాయి'' అని అంటారు. సీతారామశాస్త్రి సామాజిక బాధ్యత నుంచి తప్పించుకుని వెళ్ళకుండా ఆది నుంచి ఆ బాధ్యతనే పాటలు రాస్తుంటారు అనేది చాలమంది అభిప్రాయం.


అందుకే ఆయన రాసిన తొలి పాట 'విధాత తలపున ప్రభవించినది'తో ప్రారంభమైన నంది అవార్డ్‌ 'గమ్యం' చిత్రం వరకు అంటే 2008 వరకు పదిసార్లు లభించింది. గొప్ప గాయని గాయకులు అద్భుతంగా పాడినపుడు వింటూ ఎలా ఆనందం పొందుతామో చదివినపుడు కూడా అదే ఆనందం పొందగలిగితే అదే గొప్ప పాటగా నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే గొప్ప పాటలు, అద్భుతమైన పాటలు వెలువడుతాయి ఆయన కలం, గళం నుంచి.


"మంగళసూత్రం అంగడిసరుకా కొనగలవా చేజారా"కా అని ఒక్క మాటలో సూత్రం గొప్పతనం చెప్పినా

"ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు" అని జీవిత పరమార్ధం వడపోసినా
"ఎప్పుడు ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడు వదులుకో వద్దురా ఓరిమి" అని గెలుపు తలుపుకు దారి చూపినా
"పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం" అని విడాకుల చట్టానికి ఎదురేగి తప్పుని ఎత్తి చూపినా
అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లింది .

సాహితీ లోకాన "సిరి" చందనమై సౌరభించిన సగంధుడు

వేల హృదయాల్లో "వెన్నెల"వెలుగై వసించి ఉన్న వరేణ్యుడు
"సిరివెన్నెల"గా కురిసి,మదిమాపులలో మెరిసి
మనసులు గెలిచిన మేధావి
పాటల తోటన విరితావి !
"జగమంతా తన కుటుంబమన్న" తాత్వికుడు
"ఆకాశంలో ఆశల హరివిల్లులు" చూసిన స్వాప్నికుడు
"సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి నిజమడిగిన" ధీమంతుడు
"బోసినోటి తాత కీర్తి భగవద్గీత" గా వినిపించిన బోధకుడు
"పూలబాలల కేల మూణ్ణాళ్ళ ఆయువని" ఆక్రోశించిన ప్రకృతి ప్రేమికుడు
"చంద్రుళ్ళో ఉండే కుందేటిని" నేలకి దింపిన నిజమైన భావుకుడు
"అడగాలనుంది ఒక డౌటుని" అని పసిపాపలా మారాం చేసినా
"సముద్రాన్ని కన్నె పిల్ల కన్నుల్లో కన్నీటి అలలు"గా మార్చినా
"నేననీ నీవనీ వేరుగా లేమని" యువ హృదయాల్ని ఊయలలూపినా
"చెప్పుకోనీవు తప్పుకోనీవు" అని ప్రేమని సున్నితంగా మందలించినా
"జాలిగా జాబిలమ్మ" కి జోలపాడి నిద్రపుచ్చినా
"విరించిలా విపంచిలా" అక్షరాలతో వేణువులూదినా
తనకి ఎవరు రాగలరు సాటి
వింతగా మానసవీణ ను మీటి!
రవళించే రాగాలకు కమనీయపు రూపమిచ్చి
సంగీతపు సంద్రానికి ఉప్పెనలా పొంగునిచ్చి
చిన్ని పూరేకు లాంటి పాటకు చిరు చినుకులా ప్రాణమిచ్చి
అలసిపోని అల మాదిరి
కరిగిపోని కల మాదిరి
ఆగిపోదు ఆ కలం
మూగ బోదు ఆ గళం!!!!!!!!!!

వెన్నెల వెలుగును తనలోనే దాచుకోక అందరికీ పంచిస్తూ

కలకి ఇలకి బేధం చూపి జీవన సత్యం బోధిస్తూ......
అర్ధశతాప్దపు అజ్ఞానాన్నే తరిమేసే ఒక రక్తపు సిందూరమై....
వెలిగిపోతున్న మీకు ఇవే మా సహస్రకోటి వందనాలు....

గీత రచయిత 'సామవేదం షణ్ముఖశర్మ '


గీత రచయిత 'రామజోగయ్య శాస్త్రి'


తొలి సినీకవి తొలి సినిమా పాట రాయలేదా.....


సాహితీ మణిదీపం 'మల్లాది రామకృష్ణ శాస్త్రి'


గీత రచయిత 'అనంత శ్రీరాం'


రచయిత 'జొన్నవిత్తుల'


గీతరచయిత 'సుద్దాల అశోక్ తేజ'


ఆత్రేయ పాట కావాలంటే రెండు మనసులు ఉండాలి - మురారి


గీత రచయిత 'వంగపండు ప్రసాదరావు'

శ్రీ... శ్రీ...

గీత రచయిత 'దాశరధి కృష్ణమాచార్యులు'

గీత రచయిత జూనియర్ 'సముద్రాల'


తెలుగు చలనచిత్ర సాహిత్య కళామతల్లిని, నవ్యమైన, రసవంతమైన, నందనవనాలలో, పూబాటలందు నడిపించిన రచయిత సినీ కవికులపతి, సినీ భీష్ములు, శ్రీమాన్ సముద్రాల వెంకటరాఘవాచార్యులు ( సముద్రాల సీనియర్‌ ) కుమారుడే ఈ జూనియర్‌ సముద్రాల.

అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమే జీవిత మకరందం!
...
ఆయన రాసిన మొట్టమొదటి పాటే పాపులర్‌ అయింది. ఆయనే సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. " బ్రతుకు తెరువు సినిమా వచ్చింది, నాకు బతుకు తెరువు నిచ్చింది" అంటూ ఈ గీత రచయిత సముద్రాల జూనియర్ చెప్పుకునే వారట. ఆయన అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు.

తండ్రి బాటలోనే సాగుతూ సినీరంగంలో స్థిరపడాలని రామానుజాచార్య చిన్ననాటనే నిర్ణయానికొచ్చారు. వీరిది పండితవంశం. ఆంధ్ర, సంస్కృతాలు కరతలామలకం. తెనుగు ఛందస్సు, వ్యాకరణం జన్మసంస్కారంగా అబ్బాయికి అబ్బేశాయి. కవిత్వాంశతో పుట్టారు. అద్భుతమైన పద్యాలు రాసేవారు.

చెన్నై వాహినీ స్టూడియో శబ్దశాఖలో రికార్డిస్టుగా తొలినాళ్ళలో రామానుజం పనిచేశారు. ఆ ఉద్యోగం వదిలిపెట్టి, వెండితెరపై ' కలం ' కారీ పనితనానికి దిగారు. వినోదావారి "శాంతి" చిత్రంలో చిన్నసముద్రాల పాటలు రాశారు. అప్పుడే జూనియర్ గా పేరుపడ్డారు. ఒకవైపు తన తండ్రి సినీరచనా విన్యాసాలకు తోడ్పడుతూనే, తన శైలీ విన్నాణాన్నీ ప్రదర్శించుకునేవారు.

తండ్రిగారికీ అంత ఇష్టం లేకపోయినా ఇతరుల ఆకాంక్షలకి తల ఒగ్గి, రామానుజం సినిమా రచన చెయ్యడానికి ఉద్యమించాడు. నీ రాత ఎలా వుంటే అలా జరుగుతుంది. నీ యిష్టం! అన్నారు తండ్రిగారు. దాంతో ఆయన రచయితగానే ప్రవేశించాడు. వినోదావారు 'శాంతి' (1952) సినిమా మొదలు పెడుతూ రామానుజం చేత పాటలు రాయించారు. తర్వాత 'అమ్మలక్కలు' (1953)లోనూ, 'బ్రతుకు తెరువు' (1953)లోనూ పాటలు రాశాడు.

"బ్రతుకుతెరువు" సినిమా జూనియర్ సముద్రాలకు బతుకు తెరువు చూపించి, పాటల రచయితగా పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసింది. ఆ సినిమాలోని "అందమె ఆనందం.....ఆనందమె జీవిత మకరందం....." నభూతో నభవిష్యత్ గా నిలవడం జూనియర్ ఇంద్రజాలమే!

సముద్రాల జూనియర్ అని రాయడానికి సినిమావారికి మహా బద్ధకం. అందుకే టైటిల్ కార్డ్స్ లో ' సముద్రాల (జూ)' అని వేస్తుండేవారు. ఇలా చేసినప్పుడల్లా రామానుజాచార్యకు తిక్క రేగుతూ ఉండేది. "నాన్నగారి పేరు పక్కన 'సీ' అని వేసినా ఫరవాలేదు. ఇంగ్లీషులో సీ అంటే సముద్రమే. నా పేరు దగ్గర 'జూ' అంటే కుదురుతుందా చెప్పండి? నేను అక్కడినుంచి వచ్చానేమో అని ఎవరన్నా అనుకునే ప్రమాదం ఉంది కదండీ!" అని వాపోయేవారు. అయినా ఈ ' జూ ' బాధ తరచూ ఆయనకు తప్పేదికాదు.

జూనియర్ గారు సినిమాపాటల కెమిస్ట్రీ సులువుగానే అర్థం చేసుకోగలిగారు. సినిమాగీతాలు, సంభాషణల మీటర్ ను ఇట్టే పట్టేశారు. మాటలయినా, పాటలయినా క్షణాలమీద అత్యద్భుతంగా రాసిస్తేనే నిలబడతామని గ్రహించారు. అప్పటినుంచీ ఉరుకులూ పరుగులే!

యన్‌.టి.రామారావుకి- రామానుజం రికార్డిస్టుగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. ఆయన సాహిత్యాభిలాష తెలుసు. పాటలు రాస్తున్న విషయమూ తెలుసు. అంచేత తను ప్రారంభిస్తున్న 'తోడు దొంగలు' (1954)కు రచన చెయ్యమని అడిగి ఆ సినిమాకి రాయించారు. అది రామానుజం మాటలు రాసిన తొలి సినిమా. దర్శకత్వ శాఖలో కూడా పనిచెయ్యాలని, ఆయన ఎన్‌.ఎ.టి.లో సెట్సు మీద కూడా పనిచేశాడు. రామానుజం రెండో సినిమా 'జయసింహ' (1955) జయ పతాకం ఎగరవేసినప్పట్నుంచి, రామానుజం 'సముద్రాల జూనియర్‌'గా మారి సంభాషణలు రాయడం మీదనే దృష్టి సారించాడు. 'పాండురంగ మహాత్మ్యం' (1957), 'మంచి మనసుకి మంచి రోజులు' (1958), 'శాంతి నివాసం' (1960), 'ఆత్మ బంధువు' (1962), 'ఉమ్మడి కుటుంబం' (1967) 'స్త్రీ జన్మ' (1967), 'తల్లా? పెళ్లామా?' (1970), 'శ్రీ రామాంజనేయ యుద్ధం' (1975) లాంటి 70 చిత్రాలకు పైగా రచన చేశాడు జూనియర్‌ సముద్రాల.

"నర్తనశాల" చిత్రములో కీచకుడి పాత్ర కోసం కొన్ని సంభాషణలు రాయాల్సివున్నా, అనారోగ్యం కారణంగా సీనియర్ సముద్రాల వల్ల కాలేదు. ఆ బాధ్యతను జూనియర్ తన భుజాలమీద వేసుకుని, అడిగిందే తడవుగా రాసిచ్చారు. వీటిని పలికిన కీచక పాత్రధారి ఎస్.వి.రంగారావు...రామానుజాచార్యను పొగడ్తల్లో ముంచెత్తడం సన్మానం కింద లెక్కే!

"ధరణికి గిరి భారమా (మంచిమనసుకు మంచిరోజులు) , కలనైనా నీ వలపే (శాంతినివాసం) , పయనించే ఓ చిలుకా (కులదైవం) , రావే ప్రేమలతా (పెళ్ళిసందడి) , శ్రీకర కరుణాలవాల (బొబ్బిలి యుద్ధం) , మనవి సేయవే (రేచుక్క - పగటిచుక్క) " పాటలు జూనియర్ సముద్రాల చిత్కళకు ప్రతిరూపాలు.

"పాండురంగ మహాత్మ్యము" లో ఆయన రాసిన "జయ కృష్ణా! ముకుందా! మురారీ!" గీతం అప్పట్లో 2 రికార్డులుగా, 4 సైడ్లుగా వెలువడింది. రికార్డులన్నింటినీ వేల వ్రక్కలు చేసింది. ' టైం లేదు ' అనుకునే నేటి తరం కూడా ఎన్ని సైడ్లు తీసుకున్నప్పటికీ ఈ పాటను అభిమానిస్తుండటం గొప్పల్లో గొప్ప.

"అందమె ఆనందం" పాట రాశానని తండ్రి రాఘవాచార్యకు చెప్పబోతే, "కీట్స్ 'A thing of beauty is joy for ever' ను తెలుగులోకి తిప్పిరాశావా ఏంటి" అని ఆయన సణిగారట! అక్కడే ఉన్న మరో పెద్దాయన కలుగజేసుకుని మనస్సు, ప్రేమ సార్వదేశికమైనవి, సార్వకాలికమైనవి అని సర్దిచెప్పి గండం గట్టెక్కించారట!......

"జయసింహ" చిత్రం జూనియర్ సముద్రాల విశ్వరూపాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాకి మాటా, పాటా ఆడుతూ పాడుతూ ఆయన కానిచ్చేశారు. "ఈనాటి ఈ హాయీ, కల కాదోయి, నిజమోయీ" అన్న పాట తెలుగుసినిమా యుగళగీతాల్లో ఎప్పటికీ ముందువరసలోనే ఉండే సత్తా ఉన్న పాట.

జూనియర్ సముద్రాల స్నేహశీలి, మృదుభాషి, మానవతావాది. అందరినీ ' బ్రదర్ ' అని సంబోధిస్తూ మాట్లాడేవారు. ఘంటసాలతో ' ఒరేయ్ ' అనుకునే స్నేహం ఉంది. పాటల ట్యూన్ల విషయంలో ఘంటసాల మాష్టారు, జూనియర్ గారు ఆడుకునే సరససల్లాపాలు చూసేవారికి చూడముచ్చట.

1940 నాటి గుంటూరు నవ్యకళాపరిషత్తులో అనిసెట్టి సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ లతో పాటు జూనియర్ కూడా సభ్యుడే. జూనియర్, సీనియర్ రాసిన పద్యాలు చక్రపాణిగారి ఆధ్వర్యంలో "కడలిపొంగులు" పేరుతో పుస్తకరూపం ధరించాయి.

వారు లేకున్నా వారి పాటలు నేటికీ తెలుగు లోగిళ్ళలో "ఊగేములే! తులతూగేములే!" అంటూ ఊసులాడుతున్నాయి. జూనియర్ సముద్రాల ఒడ్డుకు తెచ్చి పడేసిన మంచిముత్యాల సినీగీతాలు కోమల కవితాధారలుగా, మనోహర తారలుగా, మధుర సితారలుగా ఆంధ్రులను ఆనందింపజేస్తూనే ఉన్నాయి.

గీత రచయిత 'కొసరాజు'






అతను...హలము పట్టి... పొలం దున్నుతాడు...కలం పట్టి...పాటలు రాసి...బంగారు పంటలు పండిస్తారు. మట్టిలోంచి వొచ్చిన రాజు... మట్టి వాసన తెలిసిన కలం... అమృతం కురిపించింది. ఆ రాజు పేరు కొస రాజు... కొసరి కొసరి..పాటల్ని మనకు వడ్డించిన కొసరాజుగారి వర్ధంతి నేడు... ఆయన మనకందించిన అమృత సమానమైన పాటల్ని ఆలకిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిద్దాం.

కొసరాజు గారి పూర్తిపేరు కొసరాజు రాఘవయ్య చౌదరి... ఆయన కలం నవరసాలను వొలికించేది... పాట విన్న వారి తనువు పులకించేది... తన శైలి విలక్షణం - ఇక హాస్యానికైతే కొసరాజు గారి తరువాతే ఎవరైనా - అన్పించారు. పేరు కొసరాజు తెలుగంటే పెద్ద మోజు అని తనకు తనే చెప్పుకున్నారు.

కొసరాజు... పుట్టిందే సాహితీ వనంలో... ఆ పరిమళాల మధ్యనే పెరిగినా... ఏ సువాసనా ఆపాదించుకోక తనకంటూ ఓ శైలిని పట్టుకున్నాడు. సాహిత్యం మీద పట్టున్నవాడు... పండితులు త్రిపురనేని రామస్వామి తనకు పెదనాన్న - అవుతాడు... సాహితీ ప్రక్రియలో... అన్ని అంశాలు సృశించాడు... ప్రేక్షకుల మనసులో నిండిపోయి తరించాడు.

జానపదాలను రాయటం అందరికీ చాతకాదు... అందులో ఒక వగరుంటుంది... పోగరుంటుంది... ఆ వగరుపొగరు కలిపి...కలం ఝళిపి... కొసరాజు... రాసిన పాటలెన్నో చిరంజీవులు... అయ్యాయి... నాగలి పట్టిన చేయి... కలం పడితే...పదాలను... నిఘంటువుల్లో సైతం పండితులు వెదుక్కోవాలి.

సిగిరెట్టు మీద పాటంటే... రొసరాజు రాసిన పాటే రారాజుగా మిగిలిపోతుంది... ఆ తరువాత... సిగిరెట్‌ మీద పాట రాయటానికి ఎంత పెద్ద కవికైనా ధైర్యం... చాలదేమో... సరదాగా మొదలెట్టాడో... సీరియస్‌గా...సిగిరెట్‌ తాగుతూ రాసాడేమోగానీ...సరదా సరదా సిగిరెట్టు... పాట... ఇప్పటికీ ఫ్రెష్‌గా వుంటుంది.

సినిమా అంటూ అప్పట్లో... తీస్తే... అందులో కొసరాజుగారి పాట వుండి తీరాల్సిందే... కొసరాజుగారి పాట కూరలో కరివేపాకు లాంటిది కాదు... పోపులాంటిది... ఘుమ..ఘుమలాడే సోపులాంటిది స్నానం అయ్యాక కూడా ఆ పరిమళం వెన్నంటి వుంటుంది.

కె.వి.మహదేవన్‌ గారిని మామను చేసింది... కొసరాజుగారే...మంచి మనసులు చిత్రం కోసం...మావా... మావా... మావా... అంటూ మావా... భామ..పాటను మించిన పాట ఇంకేముంటుంది. ఈ పాటలో ప్రేమ ముగ్గులోకి దింపుతారంటూ ఎంత అందంగా... రాశారో...కొసరాజుగారు నిజంగా పాటల రాజే...

ఆ మాలెక్కణుంచి వొస్తాయో... ఆ...సొగబులు ఎలా అద్దుతారో గానీ...కొసరాజుగారి పాటల గురించి ఎన్నని చెప్పుకోవాలి. సముద్రాన్ని శంఖంతో తోడితే అది ఎన్నాళ్లకు ఖాళీ అవుతుందనీ...రామాయణంలో గుహడికి ఓ పాట పెట్టటమే సాహసం అయితే ఈ పాటను పదికాలాల పాటు... నిలిచేలా రాసారు.

కొసరాజుగారు మొదట రైతుబిడ్డ చిత్రంలో కథానాయకుడిగా నటించారు... మన తెలుగు వారి అదృష్టవశాత్తూ ఆయన కలం పదును తెలుసుకున్న బి,యే. సుబ్బారావుగారు...కె.వి.రెడ్డిగారు. ఆయనతో పాటలు రాయించారు. ఆ మహాను భావులకు పాదాభి వందనాలు చేయాలి... లేకపోతే ఎన్ని మంచి పాటల్ని మనం కోల్పోయే వారమోకదా...

కొసరాజు...మట్టిని చదివాడు...మనుషుల్ని చదివాడు... మనసుల్నీ చదివాడు... ఆ మాటలు... ఆ పాటలు... ఆ హస్యం... ఆ చాతుర్యం... గోమాత పై రాసినా...భూమాత పై రాసినా... మనసు హిమంలా కరిగిపోతుంది. రచయితగా హిమాలయం అంత ఎత్తు ఎదిగిన కొసరాజుగారు... అందరికీ ఆదర్శం. ఈ సరస్వతీ మూర్తికి... జేజేలు అర్పిస్తూ...సెలవు నమస్కారం.



సినీ సాహిత్యానికి జానపద సొబ గులు అద్ది, తనకంటూ ఓకొత్త ఒరవడిని సృష్టించుకున్న కొసరాజు. చిన్ననాటినుండే తెలుగు సాహిత్యము, పురాణాలు, కావ్యాలపై పట్టు సాధించి, వరుసకు పెదనాన్న త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు. తెలుగు పండితుడు ముదికొండ నరసింహం పంతులు సాంగత్యముతో తన భాషా పటిమకు మెరుగులు బెట్టాడు. అదే సమయములో రైతుబిడ్డగా పొలము పనులలో నిమగ్నమై జానపదుల తెలుగులోని సొగసులు, చమక్కులు తెలుసుకున్నాడు.

జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి.”ఏరువాక సాగాలోరన్నో…” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా “రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ” అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.

కొసరాజుగా ప్రసిద్ది చెందిన ఈ తెలుగు సినిమా పాటల రచయిత పూర్తి పేరు కొసరాజురాఘవయ్య చౌదరి. తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆరోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యంమిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానేకొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగుసినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయతండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లోఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజురాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు. 1953 నుంచీ 1986 అక్టోబరు 27 వరకూ ఆయన మూడు వేలకు పైగా పాటలు రాశారు.

''పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు'' అని స్వయంగా ప్రకటించుకున్న జానపద గీతాల రారాజు గురించి ఎంతరాసినా తక్కువే. తెలుగు పదం, తెలుగు పద్యం, తెలుగు తనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా..., సరిగంచు చీరగట్టి... శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు... ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మూడువేలకు పైగా గీతాలు రాసి 'కవిరత్న'గా, 'జానపద కవి సార్వభౌముడు'గా పండిత పామరుల మన్ననలు పొందినవారు కొసరాజు రాఘవయ్య చౌదరి.

"చల్లపల్లి రాజావారి వివాహానికి వెళ్తే చెళ్ళపిళ్ళ, వేటూరి వంటి మహాకవులు వచ్చారు. వారి సరసన నన్నూకూచోబెట్టారు. వధూవరుల మీద నేను రాసిన పద్యాలు చదివితే, 'ఈ పిట్ట కొంచెమే అయిన కూత ఘనంగా వుందే!' అనిచెళ్లపిళ్ల వారు నన్ను ప్రశంసించారు, ఆశీర్వదించారు’" అని కొసరాజు చెప్పేవాడు. ఆయన ఇంకో విశేషం చెప్పేవాడు. జమీన్రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.

కేవలం హాస్యప్రధానమైన పాటలే గాకుండా, విభిన్నమైన అంశాలపై మంచి పాటలు రాశారు కొసరాజు. ''గాఢాంధకా రమలముకున్నా భీతి చెందక ! నిరాశలోనే జీవితాన్ని కుంగదీయక'' అనే ఉత్తేజభరితమైన పాటలను రాశారు. ఉన్నవారు, ''లేనివారని బేధాలు తొలగిపో వాలనే భావంతో'' కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా; అని ప్రశ్నించారు. ''తోడికోడళ్ళు'' చిత్రం కోసం ''ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది'' అంటూ శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటారు. అభ్యుదయ భావాలతో, సామ్యవాద దృక్పధంతో సమాజంలోని అవినీతిని ఎండగడుతూ అధిక్షేప గీతాలు రచించిన కొసరాజు పౌరాణిక చిత్రాలకు సైతం రసోచిత గీతాన్ని రాశారు.

''మంచి మనసులు'' సినిమాకోసం ''మావా మావా మావా!ఏమే భామా భామా''అంటూ రాసిన పాట, సంగీతం సమకూర్చిన మహాదేవన్‌ గారిని స్వ రాల మామను చేసింది. ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు పరస్పరం కవ్వించుకునే గీతం ''వాలు వాలు చూపుల్తో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దించుతారు మీరుగాదా'' అనేవి, ఆ తర్వాత తెలుగునాట ప్రేమోక్తలయ్యాయి. ఘంటసాల, జమునారాణి పాడిన ఈ పాట వారికి కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. ''దులపర బుల్లోడా! దుమ్ము దులపర బుల్లోడా'' పాట భానుమతిగారి నోట రసవంతంగా వినిపించేలా రాశారు. మూగజీవుల పట్ల కారుణ్యభావాల్ని ప్రకటిస్తూ ''వినరా వినరా నరుడా; తెలుసుకోర పామరుడా;'' అనే పాటను గోమాత స్వగతంగా రాశారు. ''చెంగుచెంగున గంతులు వేయండి'' పాటకూడా ఈ భావంతో సాగేదే.

రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన 'పెద్ద మనుషులు' చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి 'రాజు పేద' చిత్రములోని 'జేబులో బొమ్మ జే జేలబొమ్మ' బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో 'ఏరువాక సాగారో', 'ఇల్లరికములో ఉన్న మజా' , 'అయయో జేబులో డబ్బులు పోయెనే' , 'ముద్దబంతి పూలు బెట్టి' మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా..., సరిగంచు చీరగట్టి... శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు... ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు వ్రాశాడు.

కొసరాజు సినిమా గీతాలు మినహా మరేమీ రాయలేదనుకుంటే పొరబడినట్లే. ఆయన సినిమా పాటలు, అద్భుతమైన ఆయన కావ్యాలను మింగేశాయి. కొసరాజు జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం ప్రేరణతో రాసిన కావ్యాలు - ''గండికోట యుద్ధం'', ''కొండవీటి వైభవం''. ఈ రెండు కావ్యాల్లోనూ పద్యాలు తేలికైన పదాలతో మధురంగా సాగుతాయి. సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ మాటల్లో చెప్పాలంటే ''కొసరాజులో గురజాడ, గిడుగుల భాషావిప్లవముంది. కవిరాజు త్రిపురనేని భావవిప్లవపువేడి ఉంది. నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా కన్నీటితడి ఉంది. అప్పటి స్వాతంత్య్ర సమరోత్సాహాల, ప్రజాభ్యుదయాల ప్రభావం ఉంది. కనుకనే ఆయన భావాలు ప్రజాహితాలు, ఆయన భాష పల్లెసీమ హృదయనాదం''.
కొసరాజు స్వతంత్ర శతకాలు కూడా రాశారు. ''శంభుకర్షిప్రభుశతకం, మిత్రనీతి, వీరశేఖర శతకం, భానుగీత, సినిమాడైరెక్టరు, కొసరాజు విసుర్లు-'' ఇవన్నీ ఆయన కలం నుంచి వెలువడిన శతకాలే. అలాగే- బంగారువాన, కడగండ్లు, చిట్టిచెల్లి, రాష్ట్రగీతికలు, కాకర్ల గోపాలనాయుని వంశ చరిత్ర, నవభారతం వంటి ఎన్నో లఘురచనలు చేశారు. పల్నాటి ప్రతిభ, శివాజి, ఫాసిస్టుగీతాలు, దేవునిమొర, సుస్వాగతము, కుప్పుస్వామి చౌదరి, ఆనందబాష్పాలు... వంటి ఎన్నో లఘు రచనలు ఇంకా అముద్రితాలుగా ఉన్నాయి. వీటన్నిటితోపాటు ఆయన తన స్వీయచరిత్ర కూడా రాశారు. బుర్రకథలు రాయడంలో ఆయన దిట్ట. ఎన్నికలకు, సినిమాలకు ఎన్నో రాశారు. తెలుగు సాహిత్యంలో వివిధ సాహిత్యప్రక్రియలు చేపట్టి తన ప్రతిభేమిటో నిరూపించారు కొసరాజు. ఆయన తెలుగునాడు వినిపించే పలుకుబడులకు, సామెతలకు, నుడికారాలకు కావ్య గౌరవం కల్పించారు. ఆయన భాష సరళం. భావం సుకుమారం, పద్యకావ్యాలైనా, సినిమా గేయాలైనా, మళ్ళీ మళ్ళీ చదవాలని, వినాలని కోరుకునేలా రాశారు కొసరాజు.

ఆయన పొందిన సత్కారాలు అనేకం. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీలో ''నవభారతం'' బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిలభారత కాంగ్రెస్‌, ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి. తెనాలి క్లాసికల్‌ ఫిలిమ్‌ సొసైటీ నుంచి సముద్రాల రాఘవాచారి అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు.

''వ్రాసిన మాటలే వ్రాయుట కంటె, పాడిన పాటలే పాడుట కంటె, సరికొత్త రచనల సాగించినపుడె, కవి చమత్కారాన కథ రక్తికట్టు''- అంటూ నవ్యతకోసం పరితపించిన కొసరాజు తెలుగుభాష ఎంత కమ్మగా, కమనీయంగా ఉంటుందో తన రచనల్లో చూపారు. ''జాను దేశి కవిత నా నుడికారమ్ము, ఏ నిఘంటువులకు నెక్కకుండు, చిన్ననాటి నుండి జీర్ణించుకొన్నాను, పల్లెపదములన్న పరమ ప్రీతి''- అన్నట్లుగానే ఆయన రచనల్లో వందల సామెతలు, జాతీయాలు, పలుకుబడులు కనిపిస్తాయి.

ఇక సినిమా పాటల్లో ప్రబోధగీతాలు, సామ్యవాద గీతాలు, లోకంపోకడ తెలిపేవి, భవిష్యత్తును తెలిపేవి, పల్లెపదాలు, వ్యవసాయానికి, రైతులకు సంబంధించినవి, హాస్యగీతాలు... ఎన్నో రాశారు. జానపదగీతాల్లోని పల్లవులను, పలుకుబడులను బాణీలను, పొడుపుకథలను ఉపయోగించి తెలుగుసినిమా పాటలను ఆయన సారవంతం చేశారు. యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.

ఆయన తెలుగువాడిగా పుట్టినందుకు అనేక సందర్భాల్లో ఎంతో గర్వించారు. ఎన్నో పద్యాలు రాశారు. ''రైతు జన విధేయ రాఘవయ్య'' మకుటంతో రాసిన శతకంలో ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటారు. ''సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగుకొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె...' అంటూ వాపోయారాయన.

కాదేదీ కవితకు అనర్హమన్న రీతిలో చెట్టు, గట్టు, పుట్ట, అట్టు, సిగరెట్టు, పండుగలు, పేకాటలు, తాగుళ్ళు, ఇల్లరికపుటల్లుళ్ళ గురించి ఎన్నో పాటలు రాశారు. వినోదాన్ని విషాదాన్ని, భక్తిని, రక్తిని సమయోచితంగా తనకలం ద్వారా ఆవిష్కరించాడు. సామెతలు, పలుకుబళ్ళు, తెలుగునుడికారంతో గేయ సాహిత్యానికి వన్నె తెచ్చిన కొసరాజు 1984లో రఘుపతి వెంకయ్య అవార్డును, 1985లో కళాప్రపూర్ణ బిరుదును పొందారు.

అభ్యుదయకవిగా, ప్రజాకవిగా, రైతుపక్షపాతిగా ఆంధ్రసాహితీ మాగాణంలో తెలుగునుడికారపు పంటలు కొల్లలుగా పండించిన కొసరాజు బుద్దిమానుకోని పేకాటరాయుళ్ళ మనస్తత్వానికి ప్రతీకగా నిలిచిందీపాట. ఇంకా ''భలే ఛాన్సులే... ఇల్లరికంలో ఉన్న మజా'' 'సరదా సరదా సిగరెట్టు'' 'ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా'', 'మంగమ్మా: నువ్వుఉతుకు తుంటే అందం'' అనే హాస్య గీతాలెన్నిం టినో తన కలం ద్వారా ఒలికించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ''కొండవీటి వైభవం' (ఖండకావ్యం), గండికోటయుద్ధం (ద్విపద కావ్యం), కొసరాజు విసుర్లు, సిన్మాడైరెక్టర్‌ అనే పుస్తకాలను రాసి సాహిత్య లోకానికి అందించారు. చివరిసారిగా సురేష్‌ ప్రొడక్షన్‌ వారి ''గురుబ్రహ్మ''చిత్రానికి 1986 అక్టోబర్‌ 27వ తేదీన ''వినరా, ఆంధ్రకు మారా'' అనే బుర్రకథను రాసి, అదేరోజు రాత్రి పది గంటలకు పరమపదించారు. ఆయన హేతువాది. ఏరువాక... ఏటినీరు ఉండేంతవరకు కొసరాజే రసరాజు.

డాక్టర్ సి.నారాయణరెడ్డి


సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.

దాదాపుగా తెలుగు సినీరంగంలోని అందరి అగ్ర హీరోలతోపాటు, ఎందరో వర్ధమాన హీరోలకు పాటలు రాసిన ఖ్యాతిని దక్కించుకున్నారు. అంతేగాకుండా ఉర్దూ సాహితీ ప్రక్రియ ఆయన గజల్స్‌ కూడా తెలుగులో రాసి గజల్‌ కవిగా కూడా పేరుగాంచారు.

సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగా లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

1969లో తెలంగాణా అంతటా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యతకు ఊపునిచ్చే ... '' తెలుగు జాతి మనదీ - నిండుగ వెలుగు జాతి మనదీ...'' అనే గీతం రాసి తెలంగాణా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నరు డాక్టర్‌ 'సినారె'.

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఆధారంగా వచ్చిన ఏకవీర. సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది అక్బర్ సలీం అనార్కలి.